Showing posts with label art. Show all posts
Showing posts with label art. Show all posts

Monday, November 1, 2010

అభినవ తెలుగు సాహిత్యానికి మావయ్య - కాళ్ళకూరి నారాయణరావు


 
    
గురజాడ వారి " కన్యాశుల్కం" సాంఘిక దురాచారాలని ఖండిస్తూ, మార్పుకు అంకురార్పణ చేస్తే, కాళ్ళకూరి నారాయణరావు గారి సాంఘిక నాటకం - వరవిక్రయం (1921), అప్పటి సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ అనర్ధ హేతు చర్యలు వ్యతిరేకిస్తూ, సాంఘిక ధర్మానికి పాటుపడింది. అప్పటి వాళ్ళు కలసి కట్టుగా బహిష్కరించే సాహసం చేయలేదు. చేసుంటే నారాయణరావు గారు ఏమి చేసేవారు?

నారాయణరావు గారి " చింతామణి " నాటకం తెలుగు నాటక రంగాన్ని ఓ ఊపు ఊపింది. ఒక వ్యసనం , చక్కగా ఉన్న వ్యక్తిని ఎంత హీన స్థితికి దిగజారుస్తుందో, పర్యవసానాలు ఎంత దారుణముగా ఉంటాయో ప్రతిబింబించారు. ఈ నాటకానికి కనీ వినీ ఎరుగని ఆదరణ లభించింది. ఆదాయానికి లోటులేకండా ఇంకా మరిన్ని నాటకాలు సమర్పించడానికి వీలుగా బోళ్ళు డబ్బు తెచ్చి పెట్టింది.

ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతి రావు గారు " వరవిక్రయం" తెలులో సాహిత్యంలోని పది అత్యుత్తమ రచనలలో ఒకటి అని తెలిపారు.

వరవిక్రయము

గురజాడ వారి కాలంలో " కన్యాశుల్కం", తరువాత " వరవిక్రయము " అంతటి ఘనత లభించింది. రెండూ తెలుగు నాటక రంగ ఇతిహాసంలో ఆణిముత్యాలే. కన్యాశుల్కం అప్పటి సాంఘిక దురాచారాన్ని ఎదుర్కుంటే, వరవిక్రయము ఆ కాలం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ ఆ సాంఘిక దుస్థితిని ఎండకడుతూ వచ్చింది.

ఆ కాలంలోని సామాజిక సమస్యలకు తనదైన విచార ధారతో విశ్లేషించి, లోకం తీరును " వరవిక్రయం " రూపంలో మలిచారు. పెళ్ళి చేసుకోవడానికి భారీగా కట్న కానుకలు వసూలు చేస్తూ, వివాహం ఐదు రోజులు జరిపించుకొని, వైభవోపేతముగా సేవలు చేయించుకోవడం, పిల్ల తల్లి తండ్రులను అప్పుల ఊబిలోకి నెట్టి వేయడం వంటి పరిస్థితులను ప్రతిఘటించడానికి, నైతిక భాద్యతలను నిర్వర్తించేందుకు పిలుపునిచ్చారు. ఇలా చేయడానికి ఒక చక్కన్ని ఒరవడి, సంస్కారం, అధర్మాన్ని నిర్భయంగా ఎదుర్కునే శక్తి, ధైర్యం, సామాజిక స్పృహ, నైతిక విలువలపట్ల విశ్వాసం, బాధ్యతలు విస్మరించిన వారిని వెన్ను తట్టి లేపడం అవసరం. ఇవన్ని కలిగి ఉన్న వారు కాళ్ళకూరి నారాయణరావు గారు.

సి.పిల్లయ్య గారు 1939 లో " వరవిక్రయము " సినిమా తీసారు. భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో కాళింది గా నటించారు. దీనితో ఆమెకు మంచి పేరు వచ్చిందని వినికిడి. సింగరాజు లింగరాజు గా బలిజేపల్లి లక్ష్మికాంత కవి గారు వేశారు. బ్రహ్మాండంగా రాణించారు. " నటన అంటే అది " అని అనిపించుకున్నారు.

సమాన వయోరూప సంపత్తిలేని దాంపత్య మేమి దాంపత్యము? అని సూటిగా అడిగి అప్పటి సమాజిక స్థితి గతులను ఓ పక్క చాటుతూ, మరో పక్క వ్యత్యాసాలను, అసమంజస వైనాన్ని వేలెత్తి చూపారు. ఇది నారాయణరావు గారిలో ఉన్న ధర్మ నిరతి, సమానత, ఆదర్శ భావాలు, ముఖ్యంగా సరికాని దానిని వ్యతిరేకించే దైర్య స్థైర్యాలను చాటుతోంది. అలా రాయడమే గొప్ప!. ఇంక అది నాటకంలో ప్రదర్శించి సమాజంలోని అసమానతలను ప్రదర్శించడం ద్వారా తన సత్తాను, ప్రగాడ ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఇది బహు గొప్ప!. మెచ్చుకోక తప్పదు. ఇలాంటి వారు ఆట్టే కాన రారు మరి!.

ధనమె ప్రధానభూతముగ దంతము లూడినవాని కేనియుం
దనయులం గట్టిపెట్టు తల్లిదండ్రులు హెచ్చగుచున్న ఇట్టి
దుర్జనములోన, నింతిగ, ధరిత్రి పయిం జనియించుకుంటె
నిర్జన వనవాటిలో, నజగరంబుగ నేని జనింపగా దగున్!
ఇలా పద్యం రూపంలో పొందుపరచి వారి సామాజిక స్పృహ చెప్పకనే పరిచయం చేశారు కాళ్ళకూరి గారు.

వరవిక్రయంలో ఓ అద్బుతమైన సన్నివేశంలో లింగరాజు ఇలా అంటాడు:

ప్రాయికంబు జెట్టు పాతువాడొకండు
వరుస బండ్ల మొక్కు వాడొకండు
కష్టపడి గృహంబు గట్టువాడొకండు
వసతిగ నివసించు వాడొకండు
ఆస్తికై వ్యాజ్యంబు లాడువాడొకండు
వచ్చినది మృంగు వాడొకండు
కోరి ముండను బెట్టు కొనెడివాడొకండు
వలపు కాండై పొందు వాడొకండు

అట్లే, ధనము కూర్చునట్టి వాడొక్కండు
పడిగం దగులబెట్టు వాడొకండు
ఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టిన
లీలగాదు దీని కేల గోల?


ఇలా లోకం పోకడ ఓ పాత్రలోకి లీనం చేసి, స్వచ్చమైన భాషలో అంత్య ప్రాశతో లేస్యం చేసి అందించడంలో కాళ్ళకూరి ఆయనికి ఆయనే సాటి అని నిరూపించుకున్నారు.

ఇంకో సంధర్భములో లింగరాజు ఇలా అంటాడు:

సంపద మహత్వమెరుగని చవట బ్రహ్మ
చావు లేకుండగా నేని సలుపండైయ్యె
చచ్చునప్పుడు వెనువెంట సకలధనము
తీసికొనిపోవు విధమేని తెలుపండైయ్యో
ఇలా ధనమునే అత్యయంత ప్రీతిగా కొలిచే ప్రబుద్ధుల మనో స్వభావ ప్రలోభ భావాలను చమత్కారముగా చిత్రీకరిస్తూ ఈ లోకం వైనం చెప్పకనే చెప్పారు.

చింతామణి (1933)
తెలుగు నాటక రంగంలో పది అత్యుత్తమ నాటకాలలో ఇదొకటి.
ఈ నాటకం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. 1956 లో చింతామణి సినిమా వెలువడింది. శ్రీ హరి సుబ్బి శెట్టి సన్నివేశాలు కళగా ఉంటాయి.

గతంలో, " నా గురించి ఓ పుస్తకం రాయండి. నాకో పుస్తకమైనా అంకితమివ్వండి" అని అడిగారంట మల్లవరాజు. ఏమైనా తప్పులున్నాయి అని నా మీద దావా వేస్తే నేను ఏమైపోతాను " అని అన్నారు నారాయణరావు గారు. " మీరు ఏమైనా వ్రాయండి. నేను తప్పు పట్టుకోను" అని లిఖితపూర్వకముగా రాసి ఇచ్చాడు మల్లవరాజు.

" సింగరాజు లింగరాజు " అచ్చు మొచ్చు మల్లవరాజులా నటించారట"; మరి దీన్ని మల్లవరాజుని దృష్టిలో పెట్టుకుని రాశారట; మల్లవరాజు కి కోపం వచ్చినా పూర్వ ఒప్పందం వల్ల - " నా పేరును చిరస్థాయి చేశారు " అని మావయ్య గారిని సత్కరించారు ". గౌరవం అంటే అది!.

ఓ సారి బ్రాహ్మణుడు వచ్చాడు - అప్పుడు ఏమి జరిగింది అంటే ....
బసవరాజు సుబ్బారావు గారు కృష్ణాజీ కి ఈ విషయాలు చెప్పారు - ఒకనాడు ఓ బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం జరిపించుటకై నిశ్చయించి ఖర్చులకోసం డబ్బు అర్ధించగా మరునాడు రండి అని చెప్పి పంపేశారు కాళ్ళకూరి నారాయణరావు గారు. చేతిలో దమ్మిడి లేదు. లేదు అన్న చింతా లేదు. హాయిగా ఉండేవారు. మర్నాడు ఆ బ్రాహ్మడు వచ్చిన తరువాత ఆయనకి, రాత్రికి రాత్రి రాసిన నాటకం దస్తూరి ఇచ్చారు. ఆశ్చర్య చకితుడైయ్యాడు ఆ బ్రాహ్మణుడు. దాన్ని పలాన కొట్టు వానికి ఇవ్వండి. మీకు తగినంత పైకం ముడుతుంది అన్నారు. అలాగే జరిగింది. కొట్టు వాడు రెండు మూడు వందలు ఇచ్చాడు. చక్కగా ఉపనయనం జరిపించాడు. కొన్నాళ్ళకి ఆ కొట్టు వాడు నాటకం అచ్చు వేయించాడు.

కాళ్ళకూరి నారాయణరావు 1919 లో " పద్మవ్యూహం " నాటకంలో పద్య డయలాగులు పొందుపరిచారు. ఇలా పలు ప్రక్రియలు చేయడానికి వెనుకాడలేదు. సారంగధార నాటకం, తర్కాన్ని, ఇతిహాసాన్ని జోడించి రాశాడు. మధుసేవ (1926) ఒక కొత్త దిశామార్గాన్ని చూపించింది.

కృష్ణ జి కళ్ళకూరి గారి గురించి ఉదాహరిస్తూ ఇలా అన్నారు - " ఓ మంచి వాడి గురించి చెప్పుకొనటానికి ఈ జీవితంలో తీరిక దొరకదు. దీనికి తోడు అతడు ప్రతిభావంతుడు కూడా ఐతే, తీరిక అస్సలు దొరకొదు " అని చమత్కరించారు.

- నారాయణరావు గారు బయటికి వెళ్ళి నప్పుడు, ఒక్క బుద్ధిరాజు గారి ఇంట్లో తప్ప ఇంకెక్కడా ఎవరింట్లోనూ భోజనం చేసేవారు కాదు. అనేక మందికి ఉపకారాలు చేశారు. యవ్వరు వచ్చినా ఆదరించేవారు.

- గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా నారాయణరావు గారి శిష్యుడే.

- డాక్టర్ కొత్తె వెంకటాచారి గారు నరాయణరావు గారి - నాటకాల మీద పి హెచ్ డీ చేశారు.

తెలుగు నాటక రంగ వైభవం చాటే నాటకాలు - " వరవిక్రయము", " చింతామణి" చిరకాలం నిలచిపోయాయి. ఈ రెండూ కూడా చలన చిత్రాలుగా రూపొంది ప్రజాధరణ పొందడం విశేషం. వరవిక్రయము అప్పటి సాంఘిక దురాచరాన్ని ఎండగడితే " చింతామణి" సజాఉగా నడిచే జీవితం ఎలా నాశనం అయిపోవచ్చో అద్దం పడుతుంది. ఇలాటి అసాధారణ ధారణ కలిగి ఉన్న నారాయణరావు తెలుగు సాహిత్యానికి మావయ్యే.

Saturday, September 25, 2010

జీవితం అందంగా, అర్థవంతంగా తీర్చి దిద్దుకునే గొప్ప కళ తెలిసిన వ్యక్తి .... డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్.

ఆయనకు సంచారమంటే మహా ప్రీతి

జీవితం అందరికీ ఉంటుంది. కానీ దాన్ని అందంగా, అర్థవంతంగా తీర్చి దిద్దుకునే కళ కొందరికే తెలిసుంటుంది. అలాంటి గొప్ప కళ తెలిసిన వ్యక్తుల్లో డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ ఒకరు. గుంటూరు జిల్లా తుమ్మపూడిలో పుట్టిన ఆయన అక్కడి నుంచే ప్రపంచాన్ని చదివారు. పెయింటింగ్, ఫొటోగ్రఫీ, రచనలు, ప్రకృతి ఆరాధన, తాత్త్విక చింతన ... ఇలా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. ఆయన చనిపోయి 12 ఏళ్లు గడిచినా ఇంకా ఆయన తనకు ఇష్టమైన సపోటా తోటలో తిరుగుతున్నట్లే ఉందంటున్నారు సంజీవదేవ్ సతీమణి శ్రీమతి సులోచనాదేవి. ఆరు దశాబ్దాల జ్ఞాపకాల దొంతరలను ఆమె మురిపెంగా మనముందు పరిచారు.

పచ్చని వరిచేలు, ఆనందంగా తలలూపే కొబ్బరిచెట్ల సోయగాలు, బకింగ్‌హామ్ కెనాల్ అందాల మధ్య ఉంటుంది తుమ్మపూడి గ్రామం. ఊరి చివర పాతకాలం నాటి అందమైన డాబా ఒకటి కనిపిస్తుంది. ఇంటి చుట్టూ ఉన్న అరటి, సపోటా తోటలు, వరిచేలు మనల్ని పలకరిస్తాయి. పెద్దగేటు తీసుకొని వెళితే, నిర్మలత్వం మూర్తీభవించిన 75 ఏళ్ల శ్రీమతి సులోచనమ్మ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానిస్తారు. వరండాలో గోడకు సంజీవదేవ్ ఫొటో ఉంటుంది. ఆ పక్కనే ఆయన పెళ్లికి రోరిక్ బహుమతిగా పంపిన పెయింటింగ్ కనువిందు చేస్తుంది.
లోపలి గదిలో సంజీవదేవ్ వేసిన పెయింటింగ్స్ మనల్ని కదలకుండా చేస్తాయి. "డాబాపైకి వెళ్లి రండి... అక్కడ ఆయన వేసిన పెయింటింగ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అక్కడే కూర్చొని రాత్రంతా బొమ్మలు గీసేవారు. తెల్లారే సరికి అందమైన పెయింటింగ్ గీసి, ఎలా ఉందో చెప్పమన్నట్లు నా ముందు పెట్టేవారు'' అంటూ మనిషిని తోడుగా ఇచ్చి డాబాపైకి పంపారు సులోచన. డాబా గదిలోకి వెళ్లగానే అరుదైన సంజీవదేవ్ చిత్రాలు, సన్మానపత్రాలు, జ్ఞాపికల మధ్య పట్నాయక్ వేసిన పెద్ద సంజీవదేవ్ వర్ణచిత్రం. కిటికీ పక్కన పాతకాలం నాటి పెద్ద టేబుల్, కుర్చీలు. బహుశా అక్కడే కూర్చొని సంజీవదేవ్ రచనలకు ప్రాణం పోసేవారేమో? పెయింటింగ్స్ వేసేవారేమో? అనుకుని ఆ కిటికీ తెరిస్తే... అద్భుత లోకం అవిష్కరించుకుంటుంది.

*

ప్రకృతే సర్వస్వం

"పైన గది అంటే వారికి చాలా ఇష్టం. వరిచేలు, అరటితోటల మీదుగా బకింగ్‌హామ్ కెనాల్ అందాలను చూస్తూ చదువుకొనే వారు. రాసుకొనే వారు. ఆయనకు మరో ఇష్టమైన ప్రదేశం పక్కనే ఉన్న సపోటా తోట. రోజూ ఒక్కసారయినా తోటలో కాసేపు అలా పచార్లు చేయనిదే ఆయనకు మనశ్శాంతి ఉండేది కాదు. అందుకే ఆయన సమాధిని అక్కడే ఏర్పాటు చేశాం.

ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. ఎన్నో చోట్ల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. ఆయన తీసిన ఫొటోలే మా మధ్య బంధాన్ని పెంచాయి. మాది కొల్లూరు మండలం దోనెపూడి. నాన్నగారు మద్రాసులో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు. నేను అక్కడే ఇంటర్ చదువుతున్న రోజుల్లో సెలవులకని దోనెపూడి వచ్చాను. పెళ్లిచూపులకు సిద్ధం కమ్మన్నారు. ఆ రోజుల్లో పెద్దవాళ్లు చెప్పింది చేయడమే కానీ వాళ్లకు ఎదురు మాట్లాడడం ఉండేది కాదు. ఆ నోటా ఈ నోటా తెలుసుకున్నదేమిటంటే అబ్బాయికి ఆస్తి పాస్తులున్నాయి. బాగా చదువుకున్నాడు. పుస్తకాలు రాస్తాడు అని. పెళ్లి చూపులయ్యాయి. ఆయన తను తీసిన ఫోటోల ఆల్బంను నాకు పంపారు చూడమని. అలా ఫొటోలు మా బంధాన్ని పెంచాయి. పెళ్లయింది. తుమ్మపూడిలో కాపురం పెట్టాం. మొదట్లో మావాళ్లలో కొందరు గొణిగేవారు. చేతిలో ఇంత కళ ఉండీ ఈ మారుమూల పల్లెటూర్లో ఉండడం ఎందుకు? మద్రాసు వస్తే ఎంతపేరు ... ప్రఖ్యాతి అని. నాకూ పల్లె వాతావరణం ఇష్టం. ఆయనకు ప్రకృతే సర్వస్వం. అందుకే ఆ ప్రస్థావన మా ఇద్దరి మధ్యా ఎప్పుడూ రాలేదు.

రాహుల్ సాంకృత్యాయన్ మా ఇంట్లో వారమున్నారు

రోజూ పోస్ట్‌మెన్ కోసం ఎదురు చూడడం ఆయనకు ఇష్టమైన పనుల్లో ఒకటి. ఉత్తరాలు రాగానే వాటికి వెంటనే బదులిచ్చేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బంధువు, శిష్యుడు అశిత్ కుమార్ హల్దార్, ఫెడ్రిక్ రోరిక్, రాహుల్ సాంకృత్యాయన్ వంటి వారెంద రి నుంచో ఉత్తరాలు వచ్చేవి. రాహుల్ సాంకృత్యాయన్ తుమ్మపూడి వచ్చి వారం ఉన్నారు. నేను ఆయన్ను కలవలేకపోయాను. ఆ సమయంలో నేను అమ్మావాళ్లింట్లో ఉన్నాను. ఆచంట జానకిరామ్, శారద, పట్నాయక్, ఎస్. రామారావు వంటి ప్రముఖులు, మరెందరో రచయితలు ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు. వచ్చిన వారితో వర్తమాన విషయాలపై చర్చలు నడిచేవి. అలాంటి వారు వచ్చినప్పుడు నాలుగురోజులు ఉండనిదే ఆయనకు తృప్తిగా ఉండేది కాదు. కొత్తవారయినా సరే ఇంటికి వచ్చిన వారికి అరిటాకులో భోజనం పెట్టకుండా పంపితే ఆయన నొచ్చుకొనే వారు. ఆయన ఎవరినీ కోప్పడిన సందర్భం లేదు. ఎప్పుడూ నిర్మలంగా ఉండేవారు. నిశ్శబ్దాన్ని ఇష్టపడేవారు. పుస్తకాలు, ఫొటోలు, పెయింటింగ్స్, లేఖలు, చింతన, చర్చలే ఆయన జీవితం.

ఎక్కువగా తాత్త్విక ధోరణి కనిపించేది

నాకు తెలిసిన రోజు నుంచి చివరి శ్వాస తీసుకొనే దాకా ఆయన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పులేదు. ఎలాంటి ఉరుకులు, పరుగులు లేని జీవన శైలిని ఆయన సాధన చేశారు. సొంతం చేసుకున్నారు. కష్టంలో కూడా ఆయన కలవరపడేవారు కాదు. మొదట మాకు ఒక అబ్బాయి పుట్టి పోయాడు. నేను బాధపడుతుంటే, "చింతపడకు, ఏడాది తిరగకుండా వాడే మళ్లీ పుడతాడు'' అంటూ ధైర్యం చెప్పారు. అలానే జరిగింది. అలా ఆయనలో ఎక్కువ సందర్భాల్లో తాత్త్విక ధోరణి కనిపించేది. పిల్లలు జోగేంద్రదేవ్, మహేంద్రదేవ్‌ల చదువుల విషయంలో కూడా వాళ్ల స్వేచ్ఛను కాదనే వారు కాదు.
మొదట్లో ఆయన పెయింటింగ్స్ వేసేవారు కాదు. దృష్టి అంతా ఫొటోగ్రఫీ మీద ఉండేది. దేశంలో చాలా పట్టణాల్లో ఫొటో ఎగ్జిబిషన్లు పెట్టేవారు. నేను కూడా వెళ్లేదాన్ని. ఎందరో ప్రముఖులు ఆయన్ని పొగుడుతుంటే ఆయన వినమ్రంగా ఉండేవారు. అంతటి నిగర్వి ఆయన. ఆ తరువాత పట్నాయక్, ఆచంట జానకిరాంల ప్రోత్సాహంతో పెయింటింగ్ మీద దృష్టి పెట్టారు. ఆసేతు హిమాచలం ఆయన చూసిన ప్రకృతి అందాలన్నీ ఆ పెయింటింగ్స్‌లో ప్రతిఫలించేవి.

అరుదైన జీవన శైలి ఆయనది

చాలా సందర్భాల్లో నాకు ఆశ్చర్యం అనిపించేది. హైస్కూలు స్థాయి దాటని చదువుతో ఇంగ్లీషు, బెంగాలీ, ఫ్రెంచ్, హిందీ, ఉర్దూ భాషలు నేర్చుకోవడం ఏమిటి? తెలుగు, ఇంగ్లీషులో 23 పుస్తకాలు రాయడం ఏమిటి? ఇందరు ప్రముఖుల స్నేహాలు లభించడం ఏమిటి? ఆంధ్రాయూనివర్శిటీ నుంచి డి.లిట్‌తో పాటు ఇన్ని సత్కారాలు, గౌరవాలు అందుకోవడం ఏమిటని? ఎవరినీ అనుసరించని, అరుదైన ఆయన జీవన శైలి ఆయనలో ఆలోచనను పెంచింది. అద్భుతాలు చేయించిందనిపించేది. ఆయన రచనలు చేస్తుంటే నేను వాటిని టైప్ చేసి పెట్టేదాన్ని. నన్ను కూడా రాయమని ప్రోత్సహించే వారు. నాకు ఇల్లు, పిల్లలతోనే సరిపోయేది.

ఆయనకు సంచారం అంటే మహా ప్రీతి. పాతికేళ్లు నిండకుండానే హిమాలయాలన్నీ తిరిగి వచ్చారు. ఆ తరువాత కూడా ఆయనలో భ్రమణకాంక్ష తీరలేదు. తరచూ కులూమనాలి వెళ్లే వాళ్లం. ఆ వాతావరణం, ప్రకృతి అందాల్ని ఆయన బాగా ఇష్టపడేవారు. స్విట్జర్లాండ్ వెళ్లాలని అనేవారు కానీ కుదరలేదు. మనుమరాళ్లు కావ్య, మానసి అంటే బాగా ఇష్టపడేవారు. మా అబ్బాయిలకు కళల పట్ల ఆసక్తి కలగలేదు కానీ మనుమరాళ్లకు ఆ లక్షణాలు అబ్బాయి. వాళ్లు వేసిన పెయింటింగ్స్ చూసి ముచ్చటపడేవారు. చివరి శ్వాస విడిచేరోజు కూడా ఆయన పనులన్నీ చేసుకున్నారు. టిఫిన్ చేశారు. వంట్లో కాస్త నలతగా ఉందన్నారు. తెనాలిలో ఉండే డాక్టర్ దక్షిణామూర్తికి కబురు పంపాం. వారు వచ్చేలోగానే కన్నుమూశారు.

ఆయన లేకపోయినా ఈ ఇంటి నిండా ఆయన జ్ఞాపకాలున్నాయి. ఈ రోజుకీ ఆయన తోటలో షికార్లు చేస్తున్నట్లే ఉంటుంది. మా పెద్దబ్బాయి జోగేంద్రదేవ్ వ్యాపారంలో స్థిరపడ్డారు. చిన్నబ్బాయి మహేంద్రదేవ్ ముంబైలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రిసెర్చ్ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నాడు. వాళ్లు అక్కడికి వచ్చి ఉండమంటారు. దశాబ్దాల ఈ బంధాన్ని వదులుకోవడం నా వల్ల కావడం లేదు. ఆయన రోరిక్‌కు రాసిన లేఖలను న్యూయార్క్‌లోని రోరిక్ మ్యూజియంలో పెట్టారు. ఈయన వేసిన పెయింటింగ్స్‌ను అమెరికాలో ఉండే ఎస్.వి. రామారావు గారు తీసుకెళ్లి, అక్కడ ప్రత్యేక గ్యాలరీలా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆయన తిరిగిన నేల పరిమళాల్ని ఆస్వాదించేందుకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఆయన జ్ఞాపకాలను నిత్యనూతనంగా ఉంచుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి?
- టి. కుమార్
ఫోటోలు : బాబీ, చిలుమూరు