గురజాడ వారి " కన్యాశుల్కం" సాంఘిక దురాచారాలని ఖండిస్తూ, మార్పుకు అంకురార్పణ చేస్తే, కాళ్ళకూరి నారాయణరావు గారి సాంఘిక నాటకం - వరవిక్రయం (1921), అప్పటి సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ అనర్ధ హేతు చర్యలు వ్యతిరేకిస్తూ, సాంఘిక ధర్మానికి పాటుపడింది. అప్పటి వాళ్ళు కలసి కట్టుగా బహిష్కరించే సాహసం చేయలేదు. చేసుంటే నారాయణరావు గారు ఏమి చేసేవారు?
నారాయణరావు గారి " చింతామణి " నాటకం తెలుగు నాటక రంగాన్ని ఓ ఊపు ఊపింది. ఒక వ్యసనం , చక్కగా ఉన్న వ్యక్తిని ఎంత హీన స్థితికి దిగజారుస్తుందో, పర్యవసానాలు ఎంత దారుణముగా ఉంటాయో ప్రతిబింబించారు. ఈ నాటకానికి కనీ వినీ ఎరుగని ఆదరణ లభించింది. ఆదాయానికి లోటులేకండా ఇంకా మరిన్ని నాటకాలు సమర్పించడానికి వీలుగా బోళ్ళు డబ్బు తెచ్చి పెట్టింది.
ప్రముఖ రచయిత శ్రీ గొల్లపూడి మారుతి రావు గారు " వరవిక్రయం" తెలులో సాహిత్యంలోని పది అత్యుత్తమ రచనలలో ఒకటి అని తెలిపారు.
వరవిక్రయము
గురజాడ వారి కాలంలో " కన్యాశుల్కం", తరువాత " వరవిక్రయము " అంతటి ఘనత లభించింది. రెండూ తెలుగు నాటక రంగ ఇతిహాసంలో ఆణిముత్యాలే. కన్యాశుల్కం అప్పటి సాంఘిక దురాచారాన్ని ఎదుర్కుంటే, వరవిక్రయము ఆ కాలం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూ ఆ సాంఘిక దుస్థితిని ఎండకడుతూ వచ్చింది.
ఆ కాలంలోని సామాజిక సమస్యలకు తనదైన విచార ధారతో విశ్లేషించి, లోకం తీరును " వరవిక్రయం " రూపంలో మలిచారు. పెళ్ళి చేసుకోవడానికి భారీగా కట్న కానుకలు వసూలు చేస్తూ, వివాహం ఐదు రోజులు జరిపించుకొని, వైభవోపేతముగా సేవలు చేయించుకోవడం, పిల్ల తల్లి తండ్రులను అప్పుల ఊబిలోకి నెట్టి వేయడం వంటి పరిస్థితులను ప్రతిఘటించడానికి, నైతిక భాద్యతలను నిర్వర్తించేందుకు పిలుపునిచ్చారు. ఇలా చేయడానికి ఒక చక్కన్ని ఒరవడి, సంస్కారం, అధర్మాన్ని నిర్భయంగా ఎదుర్కునే శక్తి, ధైర్యం, సామాజిక స్పృహ, నైతిక విలువలపట్ల విశ్వాసం, బాధ్యతలు విస్మరించిన వారిని వెన్ను తట్టి లేపడం అవసరం. ఇవన్ని కలిగి ఉన్న వారు కాళ్ళకూరి నారాయణరావు గారు.
సి.పిల్లయ్య గారు 1939 లో " వరవిక్రయము " సినిమా తీసారు. భానుమతి రామకృష్ణ ఈ సినిమాలో కాళింది గా నటించారు. దీనితో ఆమెకు మంచి పేరు వచ్చిందని వినికిడి. సింగరాజు లింగరాజు గా బలిజేపల్లి లక్ష్మికాంత కవి గారు వేశారు. బ్రహ్మాండంగా రాణించారు. " నటన అంటే అది " అని అనిపించుకున్నారు.
సమాన వయోరూప సంపత్తిలేని దాంపత్య మేమి దాంపత్యము? అని సూటిగా అడిగి అప్పటి సమాజిక స్థితి గతులను ఓ పక్క చాటుతూ, మరో పక్క వ్యత్యాసాలను, అసమంజస వైనాన్ని వేలెత్తి చూపారు. ఇది నారాయణరావు గారిలో ఉన్న ధర్మ నిరతి, సమానత, ఆదర్శ భావాలు, ముఖ్యంగా సరికాని దానిని వ్యతిరేకించే దైర్య స్థైర్యాలను చాటుతోంది. అలా రాయడమే గొప్ప!. ఇంక అది నాటకంలో ప్రదర్శించి సమాజంలోని అసమానతలను ప్రదర్శించడం ద్వారా తన సత్తాను, ప్రగాడ ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఇది బహు గొప్ప!. మెచ్చుకోక తప్పదు. ఇలాంటి వారు ఆట్టే కాన రారు మరి!.
ధనమె ప్రధానభూతముగ దంతము లూడినవాని కేనియుం
దనయులం గట్టిపెట్టు తల్లిదండ్రులు హెచ్చగుచున్న ఇట్టి
దుర్జనములోన, నింతిగ, ధరిత్రి పయిం జనియించుకుంటె
నిర్జన వనవాటిలో, నజగరంబుగ నేని జనింపగా దగున్! ఇలా పద్యం రూపంలో పొందుపరచి వారి సామాజిక స్పృహ చెప్పకనే పరిచయం చేశారు కాళ్ళకూరి గారు.
వరవిక్రయంలో ఓ అద్బుతమైన సన్నివేశంలో లింగరాజు ఇలా అంటాడు:
ప్రాయికంబు జెట్టు పాతువాడొకండు
వరుస బండ్ల మొక్కు వాడొకండు
కష్టపడి గృహంబు గట్టువాడొకండు
వసతిగ నివసించు వాడొకండు
ఆస్తికై వ్యాజ్యంబు లాడువాడొకండు
వచ్చినది మృంగు వాడొకండు
కోరి ముండను బెట్టు కొనెడివాడొకండు
వలపు కాండై పొందు వాడొకండు
అట్లే, ధనము కూర్చునట్టి వాడొక్కండు
పడిగం దగులబెట్టు వాడొకండు
ఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టిన
లీలగాదు దీని కేల గోల?
ఇలా లోకం పోకడ ఓ పాత్రలోకి లీనం చేసి, స్వచ్చమైన భాషలో అంత్య ప్రాశతో లేస్యం చేసి అందించడంలో కాళ్ళకూరి ఆయనికి ఆయనే సాటి అని నిరూపించుకున్నారు.
ఇంకో సంధర్భములో లింగరాజు ఇలా అంటాడు:
సంపద మహత్వమెరుగని చవట బ్రహ్మ
చావు లేకుండగా నేని సలుపండైయ్యె
చచ్చునప్పుడు వెనువెంట సకలధనము
తీసికొనిపోవు విధమేని తెలుపండైయ్యో ఇలా ధనమునే అత్యయంత ప్రీతిగా కొలిచే ప్రబుద్ధుల మనో స్వభావ ప్రలోభ భావాలను చమత్కారముగా చిత్రీకరిస్తూ ఈ లోకం వైనం చెప్పకనే చెప్పారు.
చింతామణి (1933) తెలుగు నాటక రంగంలో పది అత్యుత్తమ నాటకాలలో ఇదొకటి.
ఈ నాటకం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. 1956 లో చింతామణి సినిమా వెలువడింది. శ్రీ హరి సుబ్బి శెట్టి సన్నివేశాలు కళగా ఉంటాయి.
గతంలో, " నా గురించి ఓ పుస్తకం రాయండి. నాకో పుస్తకమైనా అంకితమివ్వండి" అని అడిగారంట మల్లవరాజు. ఏమైనా తప్పులున్నాయి అని నా మీద దావా వేస్తే నేను ఏమైపోతాను " అని అన్నారు నారాయణరావు గారు. " మీరు ఏమైనా వ్రాయండి. నేను తప్పు పట్టుకోను" అని లిఖితపూర్వకముగా రాసి ఇచ్చాడు మల్లవరాజు.
" సింగరాజు లింగరాజు " అచ్చు మొచ్చు మల్లవరాజులా నటించారట"; మరి దీన్ని మల్లవరాజుని దృష్టిలో పెట్టుకుని రాశారట; మల్లవరాజు కి కోపం వచ్చినా పూర్వ ఒప్పందం వల్ల - " నా పేరును చిరస్థాయి చేశారు " అని మావయ్య గారిని సత్కరించారు ". గౌరవం అంటే అది!.
ఓ సారి బ్రాహ్మణుడు వచ్చాడు - అప్పుడు ఏమి జరిగింది అంటే ....
బసవరాజు సుబ్బారావు గారు కృష్ణాజీ కి ఈ విషయాలు చెప్పారు - ఒకనాడు ఓ బ్రాహ్మణుడు తన కుమారుడి ఉపనయనం జరిపించుటకై నిశ్చయించి ఖర్చులకోసం డబ్బు అర్ధించగా మరునాడు రండి అని చెప్పి పంపేశారు కాళ్ళకూరి నారాయణరావు గారు. చేతిలో దమ్మిడి లేదు. లేదు అన్న చింతా లేదు. హాయిగా ఉండేవారు. మర్నాడు ఆ బ్రాహ్మడు వచ్చిన తరువాత ఆయనకి, రాత్రికి రాత్రి రాసిన నాటకం దస్తూరి ఇచ్చారు. ఆశ్చర్య చకితుడైయ్యాడు ఆ బ్రాహ్మణుడు. దాన్ని పలాన కొట్టు వానికి ఇవ్వండి. మీకు తగినంత పైకం ముడుతుంది అన్నారు. అలాగే జరిగింది. కొట్టు వాడు రెండు మూడు వందలు ఇచ్చాడు. చక్కగా ఉపనయనం జరిపించాడు. కొన్నాళ్ళకి ఆ కొట్టు వాడు నాటకం అచ్చు వేయించాడు.
కాళ్ళకూరి నారాయణరావు 1919 లో " పద్మవ్యూహం " నాటకంలో పద్య డయలాగులు పొందుపరిచారు. ఇలా పలు ప్రక్రియలు చేయడానికి వెనుకాడలేదు. సారంగధార నాటకం, తర్కాన్ని, ఇతిహాసాన్ని జోడించి రాశాడు. మధుసేవ (1926) ఒక కొత్త దిశామార్గాన్ని చూపించింది.
కృష్ణ జి కళ్ళకూరి గారి గురించి ఉదాహరిస్తూ ఇలా అన్నారు - " ఓ మంచి వాడి గురించి చెప్పుకొనటానికి ఈ జీవితంలో తీరిక దొరకదు. దీనికి తోడు అతడు ప్రతిభావంతుడు కూడా ఐతే, తీరిక అస్సలు దొరకొదు " అని చమత్కరించారు.
- నారాయణరావు గారు బయటికి వెళ్ళి నప్పుడు, ఒక్క బుద్ధిరాజు గారి ఇంట్లో తప్ప ఇంకెక్కడా ఎవరింట్లోనూ భోజనం చేసేవారు కాదు. అనేక మందికి ఉపకారాలు చేశారు. యవ్వరు వచ్చినా ఆదరించేవారు.
- గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా నారాయణరావు గారి శిష్యుడే.
- డాక్టర్ కొత్తె వెంకటాచారి గారు నరాయణరావు గారి - నాటకాల మీద పి హెచ్ డీ చేశారు.
తెలుగు నాటక రంగ వైభవం చాటే నాటకాలు - " వరవిక్రయము", " చింతామణి" చిరకాలం నిలచిపోయాయి. ఈ రెండూ కూడా చలన చిత్రాలుగా రూపొంది ప్రజాధరణ పొందడం విశేషం. వరవిక్రయము అప్పటి సాంఘిక దురాచరాన్ని ఎండగడితే " చింతామణి" సజాఉగా నడిచే జీవితం ఎలా నాశనం అయిపోవచ్చో అద్దం పడుతుంది. ఇలాటి అసాధారణ ధారణ కలిగి ఉన్న నారాయణరావు తెలుగు సాహిత్యానికి మావయ్యే. |
No comments:
Post a Comment