Friday, October 1, 2010

తెలుగునాట గాంధీజీ అడుగుజాడ


... ఈశ్వర్-అల్లా తేరేనామ్ సబ్‌కో సన్మతి దే భగవాన్
‘‘మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి రక్తమాంసా లతో భూప్రపంచంలో నడయాడాడంటే భవి ష్యత్తు తరాల వారు నమ్మరు’’ అని ప్రఖ్యాత శాస్తవ్రేత్త ఐన్‌స్టయిన్ అన్నారు.

స్వజాతిని, స్వదేశాన్ని సత్యాగ్రహ విధానం ద్వారా ప్రభావితం చేసిన మహితాత్ముడు మహా త్ముడు. భారత దేశోన్నతితోపాటు సమస్త మానవ కళ్యాణం కోసం కృషి చేసిన మహాత్ముని అడుగు జాడల్లో తెలుగుజాతి నడిచింది. మహాత్ముని ప్రభావంతో ఎందరో తెలుగు ప్రముఖులు సర్వస్వం అర్పించి స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. నిర్మాణ కార్యక్రమానికి తమ జీవితాలను అంకితం చేసిన నిస్వార్థ సేవాపరాయణులెందరో ఉన్నారు. గాంధీజీ మెచ్చిన తెలుగు ప్రముఖులను మహాత్ముని జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవడమే మా ఉద్దేశం.


కాశీనాథుని నాగేశ్వరరావు
కృష్ణా జిల్లా ఎలకుర్రులో జన్మించిన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుపై మహాత్ముడు ఎంతో మమకారం చూపారు. మద్రాసులో స్వయంగా 1933 డిసెంబరు 22న చెన్నపురి ఆంధ్ర మహాసభలో దేశోద్ధారకుని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంలో విశ్వదాతపై వారు చేసిన ప్రసంగం మహత్తరమైంది. ‘నేను నాగేశ్వరరావు పంతులుగారిని ఎరిగి ఉన్నప్పటి నుంచి ఆయనలో ఒక ప్రత్యేక లక్షణం గమనిస్తున్నాను. అవసరమైనప్పుడు సహాయం ఆపేక్షించే వారికి ఆత్మ సమర్పణ చేయడమే ఆయన ఆదర్శం. అదే ఆయన ప్రత్యేకత. నేనొకమారు వారితో చలోక్తిగా ‘‘అమృతాంజనం పేరుతో ప్రజలను మీరు వంచిస్తున్నారు గదా’’ అన్నాను. ‘‘నిజమే, నేను మీ మాట కాదనను, అది వంచన అయినా నిరుపద్రవ మయిన వంచన. అది ఎవరికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయదు. అమృతాంజనం వాడేవారు దాని నివారణ శక్తిలో విశ్వాసముండే కొంటున్నారు. ఆ నమ్మకం వల్లనే వారికి గుణం ఇస్తున్నది. ఆ నమ్మకమే నా వ్యాపారానికి ఆధారం. కాని నేనొక మాట మాత్రం నిశ్చయంగా చెప్పగలను. అమృతాంజనం వల్ల వచ్చే లాభంలో ఎక్కువ భాగం ఆర్తుల కష్ట నివారణకు వినియోగిస్తున్నాను. ఈ వ్యాపారానికిదే పరమ ప్రయోజనం’’ అన్నారు నాగేశ్వరరావుగారు. ఈ సమాధానం విన్నంతనే ఇతడే నాకు నచ్చిన మనిషని పించింది. ఆయన ప్రత్యుత్తరంలో త్రికరణ శుద్ధి, వినమ్రత, సత్యసంధత ప్రతిబింబించాయి.

యాచకులెవరైనా కన్నీరుపెట్టి ‘దేహీ’ అంటే ‘నాస్తి’ అనే మాట ఆయన నాలుకకు రాదు. ‘నా వంటి వారు కూడా వారిని ఆశ్రయించి రిక్త హస్తాలతో తిరిగి రాలేదు’ అని గాంధీజీ అన్నారు. సద్గుణాలను, ఉదారాశయాలను మీ జీవితాలలో మీరు ఆచరణలో పెట్టగలిగినప్పుడే ఈ చిత్ర పటావిష్కరణలోని సంపూర్ణ ఫలితం మీరు పొందగలరు’ అని మహాత్ముడు తమ ప్రసంగంలో కాశీనాథుని వారిపై తనకున్న ప్రేమాభామానాలు వ్యక్తపరిచారు.

కొండా వెంకటప్పయ్య
దేశ భక్త కొండా వెంకటప్పయ్య మహాత్ముని అడుగు జాడల్లో నడచిన తెలుగు ప్రముఖుల్లో ప్రథముడు. గాంధీజీ గౌరవాదరాలకు పాత్రుడైన మహోన్నతుడు. ‘కొండా వెంకటప్పయ్య ఆంధ్రుల ఔన్నత్యానికి చిహ్నమని నా అభిప్రాయం. ఆ ప్రాంతంలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఆయన మేల్కొన్నారు. ఆయన గొప్ప శీలవంతుడు. ఆయన అహింసను స్వమతధర్మంగా స్వీకరించారు. ఆయన పూర్తిగా అహింసావాది’’ అని ప్రస్తుతిస్తూ 1921లో యంగిండియాలో గాంధీజీ రాశారు.

అల్లూరి సీతారామరాజు

18.7.1929 యంగిండియాలో ‘‘అల్లూరి సీతా రామరాజు గురించి నాకేమీ తెలియదు. కాని విచారిం చగా ఆయన వీరోచిత కృత్యాల గురించి అనేక కథలు నాకు వినవచ్చాయి. అవి భావస్ఫోరకాలుగాను, ఉత్సాహజనకాలుగాను ఉన్నాయి. సాయుధ విప్లవం పైన నాకు సానుభూతి గానీ, అభిమానంగానీ లేవు. రాజు వంటి శీలవంతుడు, నిరాడంబరుడు, త్యాగి, ధైర్యవంతుడు, ఉన్నతాశయుడు అయిన యువకుడిని నేను అభినందించకుండా ఉండలేకపోయినాను’’ అని రాశారు. కాంగ్రెస్ పత్రిక సంపాదకులు మద్దూరి అన్నపూర్ణయ్య పంపిన సీతారామరాజు జీవిత గాథను ‘యంగిండియా’లో ప్రచురించారు.

డా॥భోగరాజు పట్టాభి సీతారామయ్య
‘‘వైశ్య సూత్రకారుణ్ణి అయిన నాకు పట్టాభి బ్రాహ్మణ భాష్యకారుడు’’ అని మహాత్ముని మన్ననను పొందిన మేధో సంపన్నుడు డా॥భోగరాజు. 1939లో గాంధీజీ పట్టాభి గారిని కాంగ్రెస్ అధ్యక్షుని చేయాలని ఆకాంక్షించారు. అయితే సుభాష్ చంద్రబోస్ చేతిలో పట్టాభి ఓడిపోయారు. ‘‘పట్టాభి ఓటమి- నా ఓటమి’’ అని గాంధీజీ ప్రకటించారు. దీన్నిబట్టి పట్టాభిపై గాంధీజీకి ఎంత గౌరవమూ, అభిమానం ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. 1929లో తన ఆంధ్రదేశ పర్యటనపై యంగిండియాలో రాసిన వ్యాసంలో ‘‘డాక్టర్ పట్టాభి వ్యాపార సరళి కలిగిన చురుకైన కార్యకర్తలలో ఒకరు. అనవసరమైన ఖర్చు లన్నిటినీ, తన యాత్రలో తగ్గించగలిగారు’’ అని రాశారు. పట్టాభి పొదుపరి తనం గాంధీజీని ఎంతో ఆకర్షించింది.

ముట్నూరి కృష్ణారావు
‘సూత్రయజ్ఞం’ అనే పదానికి సృష్టి కర్త ‘కృష్ణా పత్రిక’ సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణారావు అన్న సంగతి మనకెవరికీ తెలియదు. ఆంధ్ర జాతీయ కళాశాల విద్యార్థులతో ఖద్దరు వడకటం గురించి చర్చిస్తున్న సందర్భంలో ‘‘ముట్నూరి కృష్ణారావు నన్ను శ్రద్ధగా వింటూ అప్పుడప్పుడు చర్చలలో పాల్గొనేవారు. కొంతసేపు ఇట్లా ఉన్నట్లే ఉండి ఆయన ‘‘అయితే మీరు నూలు వడకటాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్నారన్నమాట’’ అన్నారు. అప్పుడాయన కళ్లల్లో ఆధ్యాత్మిక జ్యోతి విద్యుల్లత మాదిరి ప్రకాశించింది. వెంటనే ‘‘మీరందించిన భావానికి నేను చాలా కృతజ్ఞుడను’’ అన్నాను. అప్పటి నుంచి నూలు వడికే సందర్భం వచ్చినప్పుడల్లా నేనీ ప్రయోగం (సూత్ర యజ్ఞం) చేస్తున్నాను అని 13.4.1921 నాటి యంగిండియాలో గాంధీజీ రాశారు.

కోపల్లె హనుమంతరావు
ఆంధ్ర జాతీయ కళాశాలపై మహాత్మునికి ఎనలేని మమకారం. రెండు పర్యాయాలు బందరులో ఆంధ్ర జాతీయ కళాశాలలో వారు మకాం చేశారు. కళాశాల వ్యవస్థాపకులు కోపల్లె హనుమంతరావు మృతి చెందినట్లు డా॥పట్టాభి లేఖ ద్వారా తెలుసుకున్న గాంధీజీ. ‘‘ఆడంబరం లేని శ్రమచేస్తున్న అగ్రగణ్యు నొకరిని ఆంధ్రదేశం కోల్పోయింది. ఆంధ్రదేశం చూసి మురిసి పోతున్న బందరులోని గొప్ప విద్యాలయం కోసం హనుమంతరావు శ్రమ చేశారు. ఆయన దానికోసమే బతికి తుదకు దాని కోసమే ప్రాణాలు విడిచారు’’ అని యంగిండియాలో నివాళులర్పిం చారు. 1929లో రెండవసారి జాతీయ కళాశాలను సందర్శించిన సందర్భంలో తన భావాలను యంగిం డియాలో తిరిగి సవివరంగా రాయడం విశేషం.

పింగళి వెంకయ్య
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గురించి ‘‘జాతీయ పతాకం’’ శీర్షికన యంగిండి యాలో 13.04.1921న రాసిన వ్యాసంలో ‘‘మచిలీ పట్టణంలోని ఆంధ్ర జాతీయ కళాశాలకు చెందిన పింగళి వెంకయ్య ఇతర దేశాల పతాకాలను గురించి వివరాలతో పాటు భారత జాతీయ పతాకానికి కొన్ని నమూనాలను సూచిస్తూ ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి ఏళ్ల తరబడి ప్రచారం సాగించారు. గడచిన నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి కాంగ్రెస్ మహాసభలోనూ పట్టుదలగా జాతీయ జెండాను గురించి ఆయన చేసిన కృషిని నేను శ్లాఘించక తప్పదు. బెజవాడలో ఎరుపు (హిందూ రంగు), ఆకుపచ్చ (ముస్లిం రంగు) రంగులు గల పటం పైన రాట్నాన్ని చిత్రించి తీసుకుని రమ్మని నేను వెంకయ్యను అడిగాను. ఆయన అత్యుత్సాహంతో మూడు గంటలలో నాకా జెండాను అందించాడు’’ అని గాంధీజీ రాశారు.

పొట్టి శ్రీరాములు
పొట్టిశ్రీరాములు నెల్లూరులో హరిజనులను దేవాలయ ప్రవేశం చేయించడానికి ప్రయత్నించగా ధర్మకర్తలు అంగీకరించకపోవడంతో ఉపవాసం ప్రారంభించారు. అప్పుడు గాంధీ ఒక ప్రకటన విడుదల చేస్తూ ‘‘శ్రీరాములు అజ్ఞాతుడు, నిరుపేద అయిన కాంగ్రెస్ కార్యకర్త. ఆయన నెల్లూరులో మానవసేవలో నిమగ్నమై ఉంటాడు. హరిజనుల కోసం ఆయన ఒక్కడే అక్కడ ఏకాకిగా పని చేస్తున్నాడు. శ్రీరాములు నిరాడంబరంగా పనిచేస్తు న్నాడు. హరిజనులకు దేవాలయం తెరిపించాలని ప్రయత్నిస్తున్నారు. శ్రీరాములు వంటి మనిషి ప్రజలకు తెలియకపోవడం వలన, వారి సహకారం లేకపోవడంవలన మరణించకూడదు’’ అని రాశారు.

సర్ అక్బర్ హైదరీ

హైదరాబాద్ ప్రభుత్వ కార్య నిర్వాహక శాఖాధ్యక్షుడు సర్ అక్బర్ హైదరీ మరణానంతరం గాంధీజీ ఆయన గురించి ‘హరిజన్’లో ఇలా రాశారు- ‘‘సర్ అక్బర్ హైదరీలో చాలా సుగుణాలున్నాయి. అట్లా ఉండటం చాలా దుర్లభం. ఆయన గొప్ప పండి తుడు, తత్వశాస్తవ్రేత్త, సంస్కరణవాది, భక్తిపరుడ యిన మహనీయుడు. రెండో రౌండ్ టేబుల్ మహాసభ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మేమిద్దరం కలిసి ఒకే నౌకలో ప్రయాణం చేశాం. నేను రోజూ చేసే ప్రార్థనకు ఆయన హాజరవుతుండేవారు. గీతా శ్లోకాలలోను, మేము చేసే భజన కీర్తనలలోను ఆయనకు ఆసక్తి కలిగింది. వాటినన్నిటినీ మహాదేవ్ దేశాయి చేత ఆయన అనువాదం చేయించుకున్నాడు. భారత దేశంలో మతసామరస్యం కోసం మేమిద్దరం కలసి విస్తృతంగా పర్యటన చేయాలనుకున్నాం. ఆయన నా చేత ఆ మేరకు వాగ్దానం చేయించుకున్నారు కూడా. కానీ దేవుడు అన్యధా తలచాడు’’ అని రాశారు.
మండలి బుద్ధప్రసాద్
మాజీ మంత్రి

No comments: