Thursday, August 25, 2011

అయామ్ లెజెండ్..'' నేనే బలాన్ని''

మరుగుదొడ్లు సాఫు చేసే మెహతర్ కులంలో పుట్టి దేవుళ్లను, దేవుళ్ల ఆస్తులను సంరక్షించే మంత్రిత్వ శాఖను నిర్వహించే స్థాయికి ఎదిగిన టి.ఎన్.సదాలక్ష్మి ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు సిసలైన స్ఫూర్తికి గొప్ప నిదర్శనం. ఎందరో నాయకులను నిగ్గదీస్తూ, అన్యాయాలను ఎదుర్కొంటూ, నిత్యం న్యాయం వైపే నిలబడుతూ, ఎక్కడా రాజీపడకుండా బతికిన మనిషి సదాలక్ష్మి. ఒక స్త్రీగా, మాదిగగా, తెలంగాణవాదిగా... ఎన్నిటికి ఎదురీది ఆమె గొప్ప నాయకురాలిగా, మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకుందో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అందుకే 'అడుగడుగునా నాకు చరిత్ర ఉంది' అని అంత ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగిందామె. ఆమె జీవితకథ నుంచి కొన్ని ఆసక్తికర భాగాలు .....

డిప్యూటీ స్పీకర్‌గా నా అనుభవాలను, అప్పటి అచీవ్‌మెంట్స్‌ను తలుచుకుంటే చాలా సంతోషమనిపిస్తుంది. సభలో అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, వావిలాలగోపాల కృష్ణయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, వందేమాతరం రామచందర్ రావు లాంటి హేమాహేమీలంతా ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ నాకు ఇబ్బంది కాలేదు. నా రూలింగ్‌ను ప్రతిపక్షం వాళ్లే మెచ్చుకునే వారంటే ఇగ అర్థం చేసుకోండి.

నేనొకటి గమనించాను. సభలో ఎక్కువ ఛాన్స్ అపోజిషన్‌కు ఇవ్వాలి. వారు స్టడీ చేసి వస్తరు. సప్లిమెంట్ క్వశ్చన్స్ వేస్తరు. అపోజిషన్ వారికి అవకాశం ఇస్తే గవర్నమెంట్‌కు కూడా మంచిది. విమర్శ వస్తే కనువిప్పు కలుగుతుంది గద. అప్పట్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా అల్లూరి సత్యనారాయణ ఉండేవాడు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వవలసిందిపోయి ప్రతీసారీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య కలగజేసుకునేవారు. ఆ మంత్రికి జవాబు చెప్పడానికి వీలుకాకపోతే ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుంది కానీ, ముందే ముఖ్యమంత్రి కలగజేసుకోవడం నాకు నచ్చేది కాదు.

దాంతో ఒకసారి 'ప్లీజ్ ఆనరబుల్ సి.యం..యు మే టేక్ యువర్ సీట్. కన్సర్న్‌డ్ మినిస్టర్ మస్ట్ రిప్లయ్' అన్నాను కటువుగా. ఒక ముఖ్యమంత్రిని 'కూసో..' అన్నోళ్లు చరిత్రలోనే లేరు. నా వరకు నేను ప్రొసీడింగ్స్ తప్పితే భరించలేను. అది అసెంబ్లీ అయినా. కుటుంబమైనా. ఎవర్నయినా పేరు పెట్టే పిలుస్తాను, 'మాదిగది ఎంత పొగరు' అనుకున్నా నేను పట్టించుకునేది కాదు. అధికారం ఒక దళిత మహిళ చేతుల్లోకి వస్తే ఆమె మనసు పెట్టి పని చేస్తుందనడానికి నేనుఉదాహరణ.

పి.వి.జి రాజుతో హోరాహోరీ

ఎమ్మెల్యేగా వున్నప్పుడు ప్రజల్ని సదువుకోవాలి. ఆ రోజుల్లో నన్ను అడిగేవారికి, 'ఎవరికి శాసనం అవసరమో ఆ శాసనానికి సభ్యులు వాల్లు గావాలి' అని చెప్తుంటి. అగ్రకులస్తులైతే ఆ శాసనం వారికేమి వర్తిస్తది! అంటే బాగ బల్సినోడికి.. ఆకలి దీర్చే విధానం ఎట్ల తెలుస్తది? దీనిని ఆకలంటరు అంటే..ఏమాకలి? ఎందుకైతది ఆకలి? అని అడుగుతరు. ఆ కోవకు చెందిన వాడే పి.వి.జి. రాజు. అప్పుడు హెల్త్ మినిష్టరుగున్నడు.

ఒకసారి 'వాటీజ్ దిస్ సదాలక్ష్మి .. హంగ్రీ హంగ్రీ...! వాటీజ్ దిస్ హంగ్రీ! ఐ కాంట్ అండర్‌స్టాండ్' అన్నడు. 'చెప్త అయ్యా నువు రాజువురా నీకెందుకర్దమైతదీ ఆకలి అన్న. ఎంబడే అన్న 'సిల్వర్ స్పూన్...గోల్డ్ స్పూన్ పుట్టుక నీది. బీద వాళ్ల ఆకలి నీకేందెల్సు?' అన్నాన్నేను. 'నీ కొరకు అన్నం కాచుకొనుంటది. పేదవాడు అన్నం కొరకు కాచుకొనుంటడు. దటీజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్స్!' అంటే అతను నోరిప్పలేదు. కండ్లెల్ల వెట్టిండు'.

దళితుల దగ్గర గుగ్గిళ్లు కూడా కొనరే...

ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ 'ఆ పల్లెటూర్లు బాగుపడాలంటే, ఆర్థికంగా మెరుగుపడాలంటే మొట్టమొదటగా ఆయా గ్రామాల దళిత వాడలు ఆర్థికంగాను, అన్ని రకాలుగాను బాగుపడాలి. అందుకు దళితులకు భూములివ్వాలి. గ్రామాలలో ఇతర కులాల బీదలు కూడా ఉన్నారు. ఆ ఇతర బీదలకు, దళితులకు ఆర్థికంగా భేదం లేకపోచ్చును గాని, నాదొక మనవి. ఆ ఇరువురికీ ఒక ముఖ్యమైన భేదం ఉంది.

ఇతర జాతి బీదవాండ్లు ఏదో ఒక వృత్తి చేసుకుని బతకొచ్చు. గుగ్గిళ్లయినా వేసుకొని అమ్ముకొని బ్రతుకవచ్చు. కాని ఆ అవకాశం కూడా దళితులకు లేకపోవచ్చు. దళితులను అంటరానివాళ్లుగా చూస్తూ ఆఖరుకి వాళ్ల గుడ్డలు అంటుకున్నా కాని ఆ గుడ్డలను నీళ్లలోవేసి తడుపుకొనేటపుడు, ఇంక వాళ్ల దగ్గర గుగ్గిళ్లు ఎవరు కొంటారు? అంటే ఆ గుగ్గిళ్లయినా అమ్ముకొని బ్రతికే అవకాశం దళితులకు లేదన్నమాట. కనుక భూములను ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దళితులకివ్వాలని నేను మనవి చేస్తున్నాను'.

ఎండోమెంటు బాపనోల్ల రిజర్వేషనుగా ఉండె

ఎండోమెంటు శాఖలో రిజర్వేషన్లు గూర్చి చెబుతూ ఆమె... 'దేవాదాయ ధర్మాదాయ శాఖలో రిజర్వేషన్లు లేవు గద. అంతా బాపనోల్లే. ఆల్లకే రిజర్వేషను నడిసింది. అక్కడ కమిటీల్లో పూజార్లుగ దళితులను నియమించాలని'బెట్టిన నేను. అండ్ల పదిహేను శాతం మాల మాదిగలు పూజార్లు కావాలె. దానికి యాదగిరి గుట్టలో ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ జేసిన. ఇపుడు పదిహేను శాతం రిజర్వేషన్‌లు తీసుకుంటున్నరు. దేవాదాయ భూములున్నయి.

అవి ఆక్షన్ బెడితే ఎవరో వేరే కులస్తుడు దీసేసుకుంటడు. దాన్ని ఆప్షన్ బెట్టకుండ మూడు సంవత్సరాలు యావరేజ్ తీసుకొని దళితులకిచ్చే విధానాన్ని చేసేసిన. అస్సలు గుడుల నుంచే అన్‌టచబులిటీ స్టార్టయ్యింది. అందుకే ప్రతీ ట్రస్టులో ఒక దళితుడుండాలని, ఒక ఆడ మనిషి ఉండాలని పెట్టిన. ఇంకొకటి ఏమంటే భక్తి ఎక్కువుంటది ఆడవాల్లకు. ఆ విధంగా నేను స్వయాన ఆడ మనిషినైనందుకు, నా కులం దళిత అయినందువల్ల దళితుల నుంచి రిప్రజెంటేషన్ ప్రతీ ట్రస్టులో పెట్టిన. అన్‌టచబులిటీ పోవాలనేసి.

ప్రతీ ట్రస్టులో 'షెడ్యూల్డ్ క్యాస్ట్' అనేటాల్లకు లబ లబ లబ మొత్తుకున్నరు దేశమంత. అన్ని దిక్కుల్నించి వ్యతిరేకత వచ్చింది. తిరుపతి ట్రస్టులో వేసుకోవటం అయితే వాళ్లకు చాలా కష్టమైంది. అయినా నేను చేసేసిన గద. తప్పని స్థితిలో ఇంప్లిమెంట్ చేయాల్సొచ్చిందన్నట్టు. నాపై వ్యతిరేకత ఎంతవరకంటే చంపేస్తమని బెదిరింపులదాక వచ్చింది.'చంపేస్తం. నువు మాల మాదిగలను అర్చకులను ఎట్ల ఏస్తావ్' అని టెలిఫోన్లు, ఉత్తరాలు.

ఇంక కొంత మంది ప్రజలు 'ఎట్లేస్తవమ్మ, ఎట్ల తయారు చేసినవు' అని గునుగుడు. కాంగ్రెస్ అధిష్టానం నా ముందు ఏమన్లే. ఒక వేల వాల్లు ఒత్తిడి చేసినా నేను భయపడగద... భయపడను. అందర్కిదెల్సు, ఆమె అనుకున్నది జేస్తదని. అందుకే మినిస్ట్రిల ఉండనివ్వలేదు. రెండు సంవత్సరాలకే మార్చేసిన్రు గద! ఎండోమెంటు నించి ఎక్కువ దళితులకు సాయం చేస్తుండేది గుడుల తరఫు నుంచి. దాన్ని ఓర్చుకోలేకపోయిన్రు. ఇగ నన్ను ఉంచలేదు. నా కొరకు పార్టీల అడిగెటోడు లేడు. దిక్కు దివానం లేదు. ఏది జేసినా నేనే జేసుకోవాలె.

లెదర్ బోర్డుతో రగులుకొని 'ఏబీసీడీ' ఉద్యమమైంది

'లిడ్‌క్యాప్ 1960లో అనౌన్స్ అయ్యింది. నేను 1984-85 మధ్య సంవత్సరం పాటు దాని చైర్‌పర్సన్‌గ పనిజేసిన. అప్పుడు లిడ్‌క్యాప్‌ను అభివృద్ధిలోకి తెచ్చేందుకు చాలా జేసిన. కెపాసిటి పెంచినం. దాని విషయాలన్నీ స్టడి చేసేందుకే సంవత్సరమయింది. లిడ్‌క్యాప్‌లో చాలా పన్జెయ్యగలుగుతం అని మనవాల్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన, ఇంక నన్ను తీసేసిన్రు. నేను పొజీషన్‌లో ఉన్నప్పుడు అన్ని గూడ వాల్లకూ వీల్లకు అంటే మాలోల్లకు మాదిగోల్లకు కల్సి చేసుకుంటూ వచ్చిన.

అప్పుడు అందరు నన్ను పొగిడిండ్రు. 'మన షెడ్యూల్డ్ క్యాస్ట్‌ల కొరకు ఒక్కతే ఫైట్ చేస్తది, సాధిస్తది' అని అందరు మెచ్చుకున్నరు. కాని మాలలు పొజీషన్‌లో ఉన్నప్పుడు మాత్రం వ్యతిరేకం జేస్తూ బోయిండ్రు. అదెట్లాగో చెబుత. లెదర్ పని మాదిగలు జేస్తరు. అందుకే లెదర్ బోర్డును కూడా 'హ్యాండ్లూమ్ బోర్డు' లెక్కనే చెయ్యాలి, అప్పుడే మాదిగలు ఆర్థికంగ బాగుపడ్తారనేసి నేను చెబ్తూ వస్తున్న. అప్పుడు చీఫ్ మినిష్టరుగున్న దామోదరం సంజీవయ్య 'నీకెందుకు నేను చేస్తగద' అంటూనే దాన్ని 'అడ్వైజరీ బోర్డు' కింద జేసేసి అందుట్ల అందర్ని బెట్టిండు.

అంటె దాన్ని జనరల్ చేసేసిండు. ఆయన మాల. ఆ తర్వాత అడ్వయిజరీ బోర్డుకు మేనేజింగ్ డైరెక్టర్‌గ ఇంకో మాల ఐ.ఏ.ఎస్ వచ్చిండు. ఆయనొచ్చి ఢిల్లీకి బోయి లెదర్ బోర్డుని ఏకంగా కంపెనీ యాక్ట్ కిందకు తెచ్చిండు. అది కంపెనీ అయిపోయిందిక. అంటె ఏ కులంది గాదు. అన్ని కులాలవాల్లు జేరిండ్రు. దీని వల్ల చివరికి ఎక్కువగ కమ్మోల్లు, ముస్లింలు అందులో జేరి లబ్ది పొందిన్రు. మాదిగోల్లకు మాలోల్లు చేసిన మహోపకారం ఇది!

ఆరోజు సంజీవయ్య గుర్తుబెట్టుకోని మరీ దాన్ని అడ్వైజరీ బోర్డు జేసినాడంటె మాదిగోల్ల నోటికాడి కూటిని తన్నినట్లు కాలేదా? ఇంత కక్ష ఉన్నదా? మన మీద అనిపించింది. ఇదే గాదు. అన్ని చోట్ల ఇట్లనే జేసిండ్రు. 1952 నుంచి కౌన్సిల్ టికెట్ మాలలకియ్యడం, అసెంబ్లీ, పార్లమెంటు టికెట్లు మాలలకే ఇయ్యడం, అది ఎంతవరకూ వచ్చిందంటే 'రిజర్వుడు నియోజక వర్గాల్లో మాలలకు తప్ప ఎవ్వరికీ అవకాశం లేదు'అనే కాడికొచ్చింది.

ఇటువంటివన్ని నా కడుపులో రగులుకున్నవి. రగులుకోని రగులుకోని ఇక నాకు అప్పట్నించి క్యాటగిరైజేషన్ కావాలి అనేసి మనసుకొచ్చింది. ఇంకా హెచ్ఎమ్‌టి, ఐడిపియల్ వంటి పబ్లిక్ సెక్టార్లు వున్నయి కదా. అక్కడ రిజర్వేషన్ పోస్టులన్ని గూడ అప్పుడు అప్పారావు ఐ.ఎ.యస్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్‌గ ఉండె. ఆయన చక్రం తిప్పి పెద్దకాడి నుంచి చిన్నకాడికి పోస్టులన్నీ చివరికి చెప్రాసీ పోస్టు గూడ మాలోల్లకే ఇచ్చిండు. అదీ ఆంధ్ర మాలలకే. ఒక్కటి గూడ మాదిగకియ్యలే.

అంటె వాల్లకు చాన్సున్నప్పుడు వాల్లోల్లకే ఇస్తూ బోయిండ్రు. నాకు ఛాన్సున్నప్పుడు ఇద్దర్కి కల్పి ఇచ్చిన.ఈ బ్రాడ్ మైండ్ వాల్లకు లేకపాయె. మల్ల అందరమొక్కటే పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీలో ఉండి గూడ ఆ విధంగ జేసిండ్రు వాల్లు. మనోల్లకు ఇంత నష్టమైపోతుంది గద కనీసం క్యాటగిరైజేషన్ చేస్తేనే మాదిగలకు అవకాశముంటుంది ఇగ తప్పదు అని నా మనసుకు బలంగా వచ్చింది. అక్కడే దండోరకు పునాదులు పడ్డయనుకో. నాకు అడ్వైజర్స్ ఎవ్వరు లేరు. అందులో ఈ సంజీవయ్య టైములోనే బ్యాక్‌వర్డ్ క్లాస్‌కు క్యాటగిరైజేషన్ గూడ వచ్చింది.

నేను దాన్ని బేస్ చేసుకుని, నాకున్న ఎక్స్‌పీరియెన్స్‌ని అప్లయ్‌జేస్తు ఆలోచించిన. దానికంత సమయం పట్టింది. ఇక ఎస్సీలల్ల వర్గీకరణ కావాలని 1972లో జలగం వెంగళరావు చీఫ్ మినిస్టర్‌గ ఉన్నపుడు మెమోరాండం సబ్‌మిట్ జేసిన. అప్పటి నుంచి చీఫ్‌మినిస్టర్లకంత చెప్తూ, చెప్తూ వచ్చిన మొన్నటి దాక. దానెనుక అంత ఉందన్నట్టు. అపుడు కొందరు నన్ను 'నువు పిచ్చి దానివా? అట్ల ఎట్లయి దనుకుంటవ్' అన్నరు. 'మీకర్దమైత లేదండి నా కర్దమైతుంది' అనే దాన్ని.

ఆడది సమానమెట్లవుతది... ఎక్కువ కదా!

సమానత్వం, సమానత్వం అంటూ వుంటే నా చిన్న బుద్ధికి అదే అందకుండా ఉంది. అర్థం కాకుండా ఉంది. ఒక వేళ పురుషులు పురుషులకి పుట్టినట్టయితే, స్త్రీలకి స్త్రీలు పుట్టినట్టయితే సమానమనడంలో అర్థం వుండెటిది. అట్ల కాదే ఈ సృష్టే సృష్టిని ఆడవారి చేతిలో పెట్టింది. అంటే దేవుడనే వాడు ఒకడుండి, సృష్టిని సృష్టించి ఆ సృష్టిని ఆడవాళ్లకి పెట్టిండని నా దృక్పథం. కనుక మరి ఆడవారికి జన్మ ఆడదే ఇస్తది. మగవారికీ జన్మ ఆడదే ఇస్తది. మరి శరీరంలో వుండే రక్తమాంసాలన్నిటిని కరిగించి వారికి జన్మనిచ్చే ఆడది గొప్పదా? జేబులో చేతులు పెట్టుకుని తిరిగే మగవాడు గొప్పవాడా? కనుక నా దృక్పథంలో స్త్రీ గొప్ప. అది యదార్థం. సత్యం, ఒప్పుకుని తీరాల్సిందే సమాజం ఒక రోజు.

ఒక చిన్న ఉదాహరణ. ఒక యంత్రం వుంటది. ఆ యంత్రం ద్వారా ఒక పరికరం ఉత్పత్తి అయితది. ఆ పరికరం, మరి యంత్రం ఒకటేనా? యంత్రం అంటే స్త్రీ గర్భం అనుకోండి. పరికరంను యంత్రాన్ని సమానంగా చూస్తారా?ఆ ఉత్పత్తి ఎంతో బలంగా ఉండాలె, నాణ్యతగా ఉండాలె అని ఆ యంత్రాన్ని ఎంతో అపురూపంగా, జాగ్రత్తగా దానిని అప్పుడప్పుడూ సర్వీస్ చేయించడమో, లేకపోతే రిపేర్, అంటే వస్తువులు తగిలి పాడవకుండా చూడడమో జరుగుతుంది.

మామూలు యంత్రం పట్లనే ఇట్ల ఉంటే అందరికీ జన్మనిచ్చే స్త్రీ పట్ల ఎట్ల ఉండాలి. ఈ తల్లికి పరికరాలుగా పుట్టే ఈ జనాభా ఆడ, మగ ఎంత మంచిగ చూడాలి. మంచి సంతానం కొరకై తల్లిని సమాజం అపురూపంగా చూడాలె. ఆరోగ్యంగా ఉండాలని, బలంగా ఉండాలని చూడాలె. సమాజంలో స్త్రీ పాత్ర చాలా గొప్పదని నా అభిమతం. అంతేగాని పురుషులను గుడ్డిగా ద్వేషించడం నా ఉద్దేశం అసలే కాదు. నిజానికి నాకు రాజకీయాలు నేర్పిన గురువులు పురుషులే.

మిక్స్‌డ్ హాస్టళ్లు పెట్టిన

1967లో సాంఘిక, స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా నేనున్నప్పుడు ఎస్సీలు, బీసీలు, ఓసీలు కలిసిపోవాలని ప్రయత్నం జేసిన. కేవలం మాల, మాదిగ అంటే 'మామా' విద్యార్థులనే బెడ్తే అదే పరిస్థితులు వుంటాయని, అందరూ మిక్స్‌డ్ కావాలెనని ఆలోచన చేసిన. అట్ల సాంప్రదాయంగా ఎదగాలంటే ఒకరి అలవాట్లు ఒకరు చూసుకోవాల, నేర్చుకోవాలని అన్ని హాస్టల్లల బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మ, వెలమలను కూడా పెట్టిన.

అది ఇప్పటికీ నడుస్తున్నది. ఇంకా వీకర్ సెక్షన్స్ హౌజెస్‌లో గూడా బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కు, దళితులకు వేర్వేరుగ వుండేవి. నేను ఒకటే దగ్గర నిర్మించే ఏర్పాటు చేసిన. నాకు ఎవ్వరు నేర్పలేదు. ఇట్లైతే బాగయితది. ఇట్లైతే ఈ చైతన్యం వొస్తది. వాళ్ల అలవాట్లు వీళ్లకి, వీళ్ల అలవాట్లు వాళ్లకు అబ్బి స్నేహం పెరిగి గ్యాప్ తగ్గుతదని. లేకుంటె ఎక్కడున్న వాళ్లు అక్కడే వుంటరు కదా అని అట్ల జేసిన'.

'చంపేస్తం. నువు మాల మాదిగలను అర్చకులను ఎట్ల ఏస్తావ్' అని టెలిఫోన్లు, ఉత్తరాలు. ఇంక కొంత మంది ప్రజలు 'ఎట్లేస్తవమ్మ, ఎట్ల తయారు చేసినవు' అని గునుగుడు. కాంగ్రెస్ అధిష్టానం నా ముందు ఏమన్లే. ఒక వేల వాల్లు ఒత్తిడి చేసినా నేను భయపడగద... భయపడను. అందర్కిదెల్సు, ఆమె అనుకున్నది జేస్తదని. అందుకే మినిస్ట్రిల ఉండనివ్వలేదు. రెండు సంవత్సరాలకే మార్చేసిన్రు గద!

No comments: